మనీలాండరింగ్ కేసులో భాగంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ అధికారులతో పాటు ఈడీ బృందం ముంబాయిలోని సంజయ్ రౌత్ నివాసానికి చేరుకుంది. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి సుదీర్ఘంగా ప్రశ్నించిన తరువాత మధ్యాహ్నం సమయంలో సంజయ్ రౌత్ ను తమ వాహనాల్లో ఎక్కించుకుని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈడీ దాడుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో శివసేన నాయకులు, కార్యకర్తలు సంజయ్ రౌత్ నివాసం వద్దకు, ఈడీ కార్యాలయం వద్దకు చేరుకుని ఈడీ., బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రాచాల్ భూ స్కామ్ నకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన పది గంటల పాటు ఈడీ అధికారులు సంజయ్ రౌత్ ను విచారించారు. ఆ తరువాత విచారణకు రావాలని సమన్లు జారీ చేసినా సంజయ్ రౌత్ ఈడీ కార్యాలయానికి హజరు కాలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఆగస్టు మొదటి వారంలో విచారణకు హజరు అవుతానని ఈడీకి సంజయ్ రౌత్ సమాధానం ఇచ్చారు.
ఈడీ అధికారుల సోదాల సమయంలోనే ట్విట్టర్ వేదికగా సంజయ్ రౌత్ స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయలేదనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ శివసేనను వీడేది లేదని పేర్కొన్నారు. ఎలాంటి కుంభకోణంతో తనకు సంబంధం లేదని బాలాసాహెబ్ ఠాక్రే పై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నానని అన్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తూ .. ఏ తప్పు చేయకపోతే ఈడీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని సంజయ్ రౌత్ ను ప్రశ్నించింది. మీడియా సమావేశాల్లో పాల్గొనేందుకు సమయం ఉంటుంది కానీ ఈడీ విచారణకు హజరయ్యేందుకు ఆయనకు సమయం లేదా అని ప్రశ్నించింది.
కాగా ఈ అంశంపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ .. సంజయ్ రౌత్ ను ఈడీ అరెస్టు చేయవచ్చని పేర్కొన్నారు. పార్టీని నాశనం చేసే కుట్రలో భాగంగానే దర్యాప్తు సంస్థ దాడులని ఆయన ఆరోపించారు. పత్రాచాల్ భూ కుంభకోణతో సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్ సహా మరి కొంత మంది సన్నిహితులకు సంబంధం ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో వర్షా రౌత్ కు చెందిన రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. రూ.1034 కోట్ల పత్రాచల్ భూస్కామ్ కేసుకు సంబంధించి రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్ ను ఈడీ అరెస్టు చేసింది. ఆయన ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?