Maharastra: దేశంలో పెట్రో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర అనూహ్యంగా వంద రూపాయలకు చేరువ అవ్వడంతో వాహనదారుల ఆవేదన అంతా ఇంతా కాదు. పెట్రోల్ ధరల తగ్గింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా తీసుకున్న ఓ నిర్ణయానికి వాహనదారులు ఎగిరి గంతేశారు. నిన్న పెట్రోల్ బంక్ ల వద్ద వందలాది వాహనాలు ఒక్క సారిగా బారులు తీరాయి. పెట్రోల్ ధరలు అమాంతం పెరిగినా బంకు వద్ద వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరడం పాదచారులను విస్మయానికి గురి చేసింది.
అయితే ఇక్కడ విషయం ఏమిటంటే.. మంత్రి ఆదిత్య ఠాక్రే జన్మదినం సందర్భంగా (జూన్ 13) రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఠాణేలోని ఉస్మా పెట్రోల్ బంక్ వద్ద డోంబివలీ యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రూపాయికే లీటర్ పెట్రోల్ కొడుతున్నారని వార్త తెలియడంతో వందలాది మంది వాహనదారులు ఆ పెట్రోల్ బంక్ వద్ద కు పరుగులు తీశారు. నిన్న ఉదయం 10గంటల నుండి 12 గంటల వరకూ రెండు గంటల పాటు రూపాయికి లీటర్ పెట్రోల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వందలాది మంది వాహన దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
మరో వైపు మహారాష్ట్ర అంబర్నాథ్ లో శివసేన నేత అరవింద్ వాలేకర్ రూ.50లకే లీటర్ పెట్రోల్ ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. విమ్కో నాకా పెట్రోల్ బంక్ లో ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకూ పెట్రోల్ పంపిణీ చేశారు.