Rajiv Gandhi Khel Ratna: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విధానాలపై మరో సారి శివసేన మండిపడింది. బీజేపీతో దోస్తాన్ ఖటీఫ్ అయిన తరువాత తరచు కేంద్రంలోని మోడీ విధానాలను చరచు శివసేన తప్పుబడుతోంది. శివసేన అధికార పత్రిక సామ్నాలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తూర్పారపడుతూ సంపాదకీయాలు రాస్తుంది. ఇప్పుడు తాజాగా దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న పేరును హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పేరిట ధ్యాన్ చంద్ ఖేల్ రత్న గా మార్చడంపైనా శివసేన విమర్శలు గుప్పించింది. ఈ పేరు మార్పు అంశంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
Read more: Mansas Trust: టార్గెట్ అశోక్ గజపతిరాజు.. ఒకే రోజు రెండు కీలక పరిణామాలు..
రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పు అంశం రాజకీయ క్రీడలో భాగమని శివసేన ఆరోపించింది. రాజీవ్ ఖేల్ రత్న ను ధ్యాన్ చంద్ పేరిట మార్చడం వెనుక ప్రజాభిప్రాయాలు ఏమీ లేవని పేర్కొంది. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారనీ, వారి త్యాగాలను తక్కువగా చేసి చూడటం సరికాదని పేర్కొంది శివసేన, ఒక వేళ ధ్యాన చంద్ ను గౌరవించాలి అనుకుంటే అందుకు రాజీవ్ గాంధీని అవమానించాల్సిన అవసరం లేదని పేర్కొంది. క్రికెట్ క్రీడకు మోడీ ఏమి చేశారని ప్రశ్నించిన శివసేన.. అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం కు తన పేరు ఎలా పెట్టుకున్నారని ప్రజానీకం ప్రశ్నిస్తుందన్నారు.
ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పతకం తెచ్చిన ఖషబా జాదవ్ పేరిట ఖేల్ రత్న పేరు మార్చవచ్చు కదా అని శివసేన ప్రశ్నించింది. క్రీడారంగానికి మోడీ బడ్జెట్ లో రూ.300 కోట్ల మేర కోత విధించి ఇప్పుడు టోక్యో లో భారత ప్రదర్శనను తన విజయంగా చెప్పుకొంటోందని శివసేన విమర్శించింది. ఈ మేరకు శివసేన పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది.