Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సీనియర్ లకు షాక్ ఇచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలు అజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ అసమ్మతి వాదులు చేస్తున్న ఆరోపణలకు ఒకింత గట్టిగానే మాట్లాడారు. తాను తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు, తానే పూర్తి స్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేస్తూ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. పార్టీని నడిపించేందుకు సమర్ధమైన నాయకత్వం కావాల్సి ఉందని జీ – 23 నేతలు బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేసిన సోనియా గాంధీ క్లారిటీ ఇచ్చారు. దేశంలో నెలకొన్న పరిణాలపై సోనియా మాట్లాడారు.
Sonia Gandhi: తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు
తాను తాత్కాలిక అధ్యక్షురాలిని కాదనీ, పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నాననీ, ఏమైనా సమస్యలు ఉంటే నేతలు నేరుగా తనతో మాట్లాడాలన్నారు. పార్టీ విషయాలను మీడియాతో మాట్లాడవద్దంటూ గట్టిగా చెప్పారు. నిజాయితీగా నేతలు వ్యక్తం చేసే అభిప్రాయాలను తాను ఎప్పుడూ ప్రశంసిస్తానన్నారు. మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీకి పూర్వవైభవం రావాలని కోరుకుంటున్నారని సోనియా అన్నారు. అందుకు పార్టీ ప్రయోజనాలు, ఐక్యత అన్నింటికీ ముఖ్యమని అన్నారు. నిజాయితీగా అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. జూన్ 30 లోపు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగానే ఈ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. అదే విధంగా పూర్తి స్థాయి సంస్థాగత ఎన్నికలకు సంబంధించి స్పష్టత ఇచ్చారు.
వచ్చే ఏడాదే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
లఖింపూర్ భేరిలో జరిగిన ఘటనపై సిడబ్ల్యుసీ సమావేశంలో దిగ్భాంతిని వ్యక్తం చేసిన సోనియా గాంధీ.. బీజేపీ నేతల మనస్తత్వానికి, రైతుల ఆందోళనలపై వారి ఆలోచనకు ఇది నిదర్శనమన్నారు. విదేశాంగ విధానం, సరిహద్దులో పరిస్థితులపైనా సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీకి అధినేతను ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా సోనియా గాంధీ పై తమకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందనీ ఆమె నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని ఆ పార్టీ నేత గులాం నబీ అజాద్ అన్నారు. సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక, చిదంబరం, చత్తీస్ గడ్, పంజాబ్ ముఖ్యమంత్రులు భుపేశ్ భగేల్, చరణ్ జిత్ సింగ్ చన్నీతో సహా 57 మంది నేతలు పాల్గొన్నారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణంగా సమావేశానికి రాలేకపోయారు.