Sonu Sood: దేశంలో కోట్లకు కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయాలు ఎంత మంది ఉన్నా ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా సాయం చేసేందుకు వారెవరూ ముందుకు రావడం లేదు. కానీ రియల్ హీరో సోనూ సూద్ మాత్రం దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా సాయం అడిగితే కాదనకుండా అపర దానకర్ణుడుగా నిలిచిపోతున్నారు. గత ఏడాది కరోనా సమయంలో, ఆ తరువాత కూడా సోనూ సూద్ దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించిన సాయం వెలకట్టలేనిది. సోనూ సేవా నిరతికి ఐక్యరాజ్యసమితి నుండి ప్రత్యేక గుర్తింపు, ప్రశంసలు లభించాయి.
ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తన భుజస్కందాలపై వేసుకుని నిరవేరుస్తున్నారు. దీంతో పలువురు అధికారులు కూడా తమ ప్రాంతంలో సేవలకు గానూ ఆయనను అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా బడ్జెట్ రిలీజ్ కావాలంటే చాలా తతంగం ఉంటుంది. అందుకే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో చిన్న చిన్న సాయాలకు స్థానిక స్వచ్చంద సంస్థల సహకారాన్ని అధికారులు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద సహాయాన్ని సోనూ సూద్ అందిస్తున్నారు.
తాజాగా ఏపిలోని నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ జనరేటర్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు సోనూ సూద్. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీనికి సాయం అందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూ సూద్ కు లేఖ రాశారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూ సూద్ 1.5 కోట్ల విలువైన ఆక్సిజన్ జనరేటర్ ను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ జనరేటర్ రోజు 2 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి కెపాసిటీ కలిగి ఉంటుంది. మరో రెండు మూడు రోజుల్లో జిల్లాకు ఆక్సిజన్ రానున్నది. సోనూ సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతో పాటు ఏపి ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.