Sonu Sood: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభం అయిన నాటి నుండి తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న సినీనటుడు సోనూ సూద్ కు ఢిల్లీ సర్కార్ అదుదైన గౌరవాన్ని ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ రియల్ హీరోగా, అపర దానకర్ణుడుగా సోనూ సూద్ పేరు గాంచిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సైతం తన భుజస్తందాలపై వేసుకుని చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ముందుకు వచ్చి సహాయం అందించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన సేవా నిరతికి ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఇప్పుడు తాజాగా దేశ రాజధాని ఢిల్లీ సర్కార్ సోనూసూద్ కు అరుదైన గౌరవం ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా పేర్కొంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సోనూసూద్ కలిశారు. తమ ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న దేశ్ కే మెంటర్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ పని చేయనున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. లక్షలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే అవకాశం తనకు ఈ రోజు లభించిందనీ, విద్యార్థులకు నిర్ధేశం చేయడం కంటే గొప్ప సేవ ఇంకేమీ ఉండదని సోనూసూద్ ఈ సందర్భంగా అన్నారు. సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఈ పథకం లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పారు సోనూసూద్.