Sonu Sood: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. దేశంలో రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటంతో వారి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పేదల పాలిట పెన్నిధిగా, అపర దాన కర్ణుడిగా కీర్తించబడుతూ దేశంలో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సోను సూద్ కరోనా బారిన పడ్డారు. ఈ ఉదయం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ నెల మొదటి వారంలో సోనూ సూద్ ను పంజాబ్ రాష్ట్రానికి కోవిడ్ టీకా బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపిన సంగతి తెలిసిందే. సోనూ సూద్ కరోనా బారిన పడినప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్నారు., తనకు కరోనా సోకినట్లు ఈ ఉదయం నిర్దారణ అయ్యిందని తెలుపుతూ సురక్షిత చర్యల్లో భాగంగా ఇప్పటికే హోంక్వారంటైన్ లో ఉన్నానని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాననిి తెలిపారు. తన గురించి ఆందోళన చెందవద్దని సూచించారు.