కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలకు సంబంధించి బెంగళూరు కోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. యడియూరప్ప ఆయన కుటుంబ సభ్యులు అనేక కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారంటూ దాఖలైన ప్రైవేటు పిటిషన్ ను విచారించిన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం..అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తుది నివేదికను నవంబర్ 2వ తేదీలోగా సమర్పించాలని ఆదేశిస్తూ.. నవంబర్ 2న తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది.
విషయంలోకి వెళితే.. సామాజిక కార్యకర్త టీజే అబ్రహం జూన్ 2021లో యడియూరప్పకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకుని బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో హౌసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ను రామలింగం కన్ స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర, కుమార్తె పద్మావతి బంధువు శశిధర్ ను నిందితులుగా పేర్కొన్నారు. అయితే తొలుత ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే పిటిషనర్ ఈ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో అబ్రహం పిటిషన్ ను పునః పరిశీలించాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెషన్స్ కోర్టు మరో సారి విచారణ జరిపింది. యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలకు సంబందించి సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది.
Read More: అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసు.. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణకు బిగ్ రిలీఫ్