అబార్షన్ల అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి కాని యువతులు కూడా అబార్షన్లు చేయించుకోవచ్చని తెలిపింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తూ.. ఇందులో వివాహితులు, అవివాహితులు అనే తేడా చూపించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది. భర్త బలవంతం చేసినా అత్యాచారం కిందకే వస్తుందనీ, వైవాహిక అత్యాాచారంగా దానిని పేర్కొనాల్సి ఉంటుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. వివాహం కాలేదన్న పేరుతో అబార్షన్ ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఎంటీపీ చట్ట ప్రకారం అవివాహిత మహిళ కూడా అబార్షన్ చేయించుకోవచ్చని తెలిపింది. అవాంఛిత గర్బాన్ని తొలగించే హక్కు మహిళలకు ఉందని పేర్కొంది.
ఎంటీపీ చట్టం నిబంధనల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకూ అబార్షన్ చేయించుకునే హక్కు మహిళలకు ఉందని తెలిపింది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అన్న వివక్ష చూపించడం నేరమని, రాజ్యాంగం ఎదుట అది నిలువజాలదని స్పష్టం చేసింది. పెళ్లి అయిన వారికి 24 వారాల లోపు అబార్షన్ కు అనుమతిస్తూ అవివాహితులను అనుమతించకపోవడం సరికాదని చెప్పింది. ప్రస్తుతం కాలం మారింది, చట్టం స్థిరంగా ఉండకూడదు, సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయని కోర్టు స్పష్టం చేసింది.