మహారాష్ట్ర లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు పరిశీలించింది. ఈ సందర్భంలో మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలకు ఊరటనిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఒక్క ఎమ్మెల్యేపైనా చర్యలు తీసుకోవద్దని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఉద్దవ్ వర్గందాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణకు మాత్రం సుప్రీం కోర్టు నిరాకరించింది. విచారణకు కొంత సమయం పడుతుందని తెలిపింది.
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన పరిణాామాల నేపథ్యంలో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లను ఉద్దవ్ వర్గం దాఖలు చేసింది. వాటిని విచారించడానికి ప్రత్యేక బెంచ్ అవసరమని, దాని వద్ద వాటిని లిస్ట్ చేయడానికి కొంత సమయం పడుతుందని ఈ రోజు కోర్టు తెలిపింది. ఈ క్రమంలో తమ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసే యోచనలో ఉన్నట్లు ఉద్దవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందిస్తూ … తాము తీర్పు ఇచ్చే వరకూ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్ ను ఆదేశించింది. అదే విధంగా శిందే ప్రభుత్వ రాజ్యాంగ బద్దతపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, శివసేన తిరుగుబాటు సభ్యులపై అనర్హత వేటు అంశం తేలాల్సి ఉందని ఈ సందర్భంగా తెలిపింది. వీటిని కూడా విచారణలో భాగం చేస్తామని చెప్పింది.
ఇటీవల ఏక్ నాథ్ శిందే నేతృత్వంలో పలువురు శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. మెజార్టీ శివసేన ఎమ్మెల్యేలు శిందే వెనుక చేరడంతో ఉద్దవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ పరిణామంతో ఉద్దవ్ సీఎం పదవికి రాజీనామా చేయగా, ఏక్ నాథ్ శిందే నేతృత్వంలో బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.
కోర్టు దిక్కార కేసులో విజయ్ మాల్యాకు బిగ్ షాక్ .. నాలుగు నెలల జైలు శిక్ష, జరిమానా