Gujarat Riots: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కాంగ్రెస్ ఎంపి ఇషాన్ జఫ్రీ భార్య జకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు నేడు తిరస్కరించింది. 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్ లోని గల్ బర్గ్ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్ ఎంపి ఇషాన్ జఫ్రీ సహా 68 మంది మరణించారు. మార్చి 2008 న సుప్రీం కోర్టు నియమించిన సిట్ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్ సిఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ని సిట్ దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోడిని సిట్ తప్పించింది. ప్రధాని మోడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ సిట్ తన నివేదకలో స్పష్టం చేసింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రధాని మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సిట్ ఉత్తర్వులను కోర్టు సమర్ధించడంతో జఫ్రీ, తీస్తా సెతల్వాద్ గుజరాత్ హైకోర్టు ను ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టులోనూ చుక్కెదురు కావడంతో సిట్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ 2018లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. పిటిషన్ అప్పీల్ కు అర్హత లేదని స్పష్టం చేసింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీం ధర్మాసనం సమర్ధించింది.