కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విదించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ స్టే కొనసాగుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. నూతన వ్యవసాయాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దులో వేలాదిగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా హర్ సిమ్రత్ మాన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్ ఉంటారని పేర్కొన్నది. కోర్టుకు నివేదిక సమర్పించేందుకే కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పింది.
నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై దాఖలైన పిటిషన్ల పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరిపింది. రైతుల సమస్య పరిష్కారం కోసమే కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. రైతులు నేరుగా గానీ, తమ తరపున న్యాయవాదుల ద్వారా గానీ సమస్యలను కమిటీకి వివరించాలని సూచించింది. అయితే రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరని రైతుల తరపు న్యాయవాది ఎంఎల్ శర్మ కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అలాంటి మాటలు వినడానికి తాము సిద్ధంగా లేమనీ, సమస్య పరిష్కారం కావాలంటే అభిప్రాయాలను చెప్పాల్సిందేనని అన్నారు.
రైతుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సోమవారం సుప్రీం కోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. అక్కడి పరిస్థితులు విషమిస్తూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చర్చల వ్యవహారం ఒక కొలిక్కి రాకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.