Supreme Court: ఇ – కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్టు, అమెజాన్ లకు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ విచారణను నిలుపుదల చేయాలంటూ ఈ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కంపెనీల విజ్ఞప్తిని తోసి పుచ్చిన సుప్రీం కోర్టు విచారణకు హజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెజాన్, ఫ్లిప్కార్టు సంస్థలు మార్కెట్ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ కొంత మంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని దేశంలోని వ్యాపార సంస్థలు చేసిన ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిగలోకి తీసుకుంది.
గత సంవత్సరం జనవరిలో ఈ సంస్థలపై విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలను సదరు సంస్థలు తోసిపుచ్చాయి. సీసీఐ ఎలాంటి ఆధారాలు లేకుండానే దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ఇ కామర్స్ సంస్థల పిటిషన్లకు విచారణ అర్హత లేదని జూలై 23 కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీటి వ్యాపార విధానాలపై దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పును ఈ సంస్థలు సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అక్కడా చుక్కెదురైంది. దిగువ కోర్టు తీర్పును సమర్ధించింది. సిసీఐ దర్యాప్తును నిలిపివేయాలన్న సంస్థల అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం..నాలుగు వారాల్లోగా విచారణకు హజరు కావాలంటూ సదరు సంస్థలకు స్పష్టం చేసింది.