Sushanth Singh Case : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి ప్రియాంక సింగ్ కు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురు అయ్యింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఫిర్యాదుపై ప్రియాంకపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టేయ్యాలని కోరుతూ ప్రియాంక బాంబే హైకోర్టు ను ఆశ్రయించగా ధర్మాసనం అందుకు నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ బోపన్న, జస్టిస్ వి రామ సుబ్రహ్మణ్యంలతో కూడిన ధర్మాసనం ప్రియాంక అప్పీల్ ను విచారించలేమని స్పష్టం చేసింది.
సుశాంత్ కు నిషేదిత మందులు ఇచ్చేందుకు తప్పుడు ప్రిస్కిప్షన్ రాసేలా డాక్టర్ తరుణ్ కుమార్ తో కలిసి సుశాంత్ తోబుట్టువులు కుట్రపన్నారని ఆరోపిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 7వ తేదీని రియా చక్రవర్తి పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ పిర్యాదుపై ప్రియాంక, ఆమె సోదరి మీతూసింగ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే మీతూ సింగ్ పై ఎఫ్ఐఆర్ కొట్టివేతకు ఆదేశాలు ఇచ్చిన బొంబే హైకోర్టు తనపై కేసును మాత్రం అలాగే ఉంచిందని ప్రియాంక తన పిటిషన్ లో పేర్కొన్నది. తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్ కూడా కొట్టేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రియాంక తాజాగా సుప్రీంలో దాఖలు చేసిన అర్జీని ధర్మాసనం తిరస్కరించింది.