పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుండి ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలనీ, ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్న కారణంగా ఉభయ సభల్లో వాయిదాల పర్వం, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ధరలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటిస్తున్నా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఆందోళన చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో ఉభయ సభల నుండి సస్పెండ్ అయిన వారి విపక్ష సభ్యుల సంఖ్య 24కి చేరింది. సస్పెండైన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం 50 గంటల రిలే నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరసన కార్యక్రమానికి దిగిన 20 మంది రాజ్యసభ ఎంపీలు, నలుగురు లోక్ సభ ఎంపీలకు ఇతర విపక్ష నేతలు ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పలు పార్టీలకు చెందిన నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేయగా, సదరు ఎంపీలు విచారం వ్యక్తం చేస్తేనే అది సాధ్యమని స్పష్టం చేయడంతో అందుకు వారు తిరస్కరించారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి సస్పెండైన ఎంపీలందరూ పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్దనే నిద్రించారు. రాత్రి అంతా వారు జాగారం చేసినట్లు తెలిసింది. గురువారం ఉదయం వారు అక్కడే కాలకృత్యాలు తీర్చుకోగా ఇతర నేతలు వారికి టీ, టిఫెన్ లు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ లో పోస్టు చేశారు.