KCR : తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో తెలంగాణ కీలక పాత్ర పోషించేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో,
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
KCR ఇదీ విషయం….
నాటి భారత స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా స్వయం పాలనలో అభివృద్ది పథంలో దూసుకు పోతున్నదని, దేశ అభ్యుదయంలో తెలంగాణ ది ఉజ్వలమైన భాగస్వామ్యమని ముఖ్యమంత్రి అన్నారు. 12 మార్చి, 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్టు సిఎం తెలిపారు.
ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి . రమణాచారి వ్యవహరిస్తారని, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్ధిక శాఖ, సాంస్క్రతిక వ్యవహారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు, డైరక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమీషనర్ పంచాయితీ రాజ్, సభ్య కార్యదర్శిగా సాంస్క్రతిక శాఖ డైరక్టర్ లు ఉంటారని సిఎం తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు జారీచేయాలని ముఖ్యమంత్రి సిఎస్ ను ఆదేశించారు.
మోడీ జీ ఏం చెప్పారంటే….
ఆజాదీకా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతను విధి విధానాలను లక్ష్యాలను ప్రధాని వివరించారు. ఆయా రాష్ట్రాలు 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ప్రధానితో వీడియో కాన్పరెన్స్ అనంతరం.. కార్యక్రమ నిర్వహణ విధి విధానాల కోసం, సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉత్సవాల నిర్వహణ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ , సాంస్క్రతిక శాఖ, కార్యదర్శి శ్రీనివాస్ రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదిరులు పాల్గొన్నారు.
ఉత్సవాల్లో భాగంగా మార్చి 12 న, హైద్రాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో, వరంగల్లు పోలీసు గ్రౌండ్స్ లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. హైద్రాబాద్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎం కెసిఆర్., వరంగల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ లు పాల్గొంటారు. 12 మార్చి న ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్ మార్చ్, గాలిలో బెలూన్లు వదలడం తదితర దేశభక్తి కార్యక్రమాలుంటాయని సిఎం తెలిపారు. ఈ కార్యక్రమాలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపాలని సిఎం సూచించారు.