Corona: ఓ వైపు కరోనా కలకలం కొనసాగుతుంటే… మరోవైపు అదే సమయంలో సామాన్యుడికి షాక్ లు తగులుతున్నాయి. ఆహార పదార్థాలు, మాస్కులు, శానిటైజర్ల వంటివాటి ధరలు పెరుగుతున్నాయి. ధరలు మరింత పెరిగి ఉండటంతో వంటనూనెలు, పప్పులు, శానిటైజర్లు, మాస్కులు, ఆక్సిమీటర్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. మినీ లాక్ డౌన్లు, నైట్ కర్వ్యూలు, రిస్ట్రిక్షన్ల వల్ల నిత్యావసరాల రేట్లకు రెక్కలు వస్తున్నాయి. సప్లైలకు ఇబ్బందులు కలుగుతుండటంతో ధరలు మరింతగా పెరుగుతున్నాయి.
ధరలు పెరుగుతున్నాయి…
లాక్డౌన్ నిబంధనల వల్ల కార్మికులు దొరకడం లేదని, ఉద్యోగులు కూడా రాలేకపోతుండటంతో సమస్యలు పెరుగుతున్నాయని పలువురు చెప్తున్నారు. అమెజాన్, ఫ్లిప్ కా ర్ట్, గ్రోఫర్స్ తదితర ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు ఢిల్లీ, ముంబై వంటి సిటీల్లో తగిన సమయానికి డెలివరీలు ఇవ్వలేకపోతున్నాయి. మహారాష్ట్రలో దుకాణాలను ఉదయం ఏడింటి నుంచి ఉదయం 11 గంటలకు మాత్రమే నడపాలని ఆదేశాలు ఉన్నాయి. కరోనా కేసులు పెరగ్గానే అప్రమత్తమైన కంపెనీలు కూడా సప్లైని బాగా పెంచాయి. అయితే కార్మికులు దొరక్కపోవడం, వివిధ రకాల షరతుల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో సిటీల్లో వంట నూనెల ధరలు 15 శాతం వరకు, పప్పుల ధరలు 10 శాతం వరకు పెరిగాయని హోల్సేల్ వ్యాపారు లు చెప్పారు. కొన్ని బ్రాండ్ల వంటనూనెలు అసలు దొరకడం లేదన్నారు.
ఇవన్నీ …
గత రెండు నెలలుగా వంట నూనెల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని బ్రాండ్ల పాలు, గోధుమ పిండి, పప్పుల రేట్లూ పెరిగాయి. కూరగాయలు, పళ్లవంటి రేట్లు ప్రాంతాన్ని బట్టి మారుతున్నాయి. కొన్ని చోట్ల మామూలు రేట్లే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో షరతులే ఇందుకు కారణమని అంటున్నారు.