గత ఎన్నికలు నేర్పిన పాఠంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం విపక్షాలకు షాకింగ్ అని చెప్పవచ్చు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో జట్టు కట్టాలని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీని ఓడించేందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్ కూడా ఆశిస్తున్నది. విపక్షాలు ఏకం అయితేనే బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ వ్యతిరేక పక్షాలు భావిస్తుండగా, తృణమూల్ అధినేత్రి మమత కీలక ప్రకటన వారిని షాకింగ్ గురి చేసింది.
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో టీఎంసీ ఒంటరిగా పోరాడుతుందని దీదీ స్పష్టం చేశారు. దీంతో విపక్షాల కూటమికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు కాకముందే పశ్చిమ బెంగాల్ లో 42 స్థానాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీపీఎం, కాంగ్రెస్ లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని మమత ఆరోపించారు. అపవిత్ర పొత్తులుంటే బీజేపీతో కాంగ్రెస్ ఎలా పోరాడుతుందని ప్రశ్నించారు. బెంగాల్ లోని సిర్దిఘిలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ ని కాంగ్రెస్ అభ్యర్ధి ఓడించిన విషయం గురించి ప్రస్తావిస్తూ.. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలు, బీజేపీ అన్నీ మతం కార్డు ఉపయోగించాయని దీదీ ఆరోపించారు.
2019 ఎన్నికల్లో మమత విపక్షాల కూటమిలో కీలక భూమిక పోషించారు. అయితే ఆ ఎన్నికల్లో కూటమికి చుక్కెదురైంది. పశ్చిమ బెంగాల్ లో 12 పార్లమెంట్ స్థానాలు నష్టపోయి 22 స్థానాలే టీఎంసీ కైవశం చేసుకుంది. బీజేపీ రెండు స్థానాల నుండి 18 స్థానాలకు ఎగబాకింది. రాష్ట్రంలో బీజేపీ విస్తరించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులను వడ్డినప్పటికీ దీదీ నేతృత్వంలోని టీఎంసీ మరో సారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈ పర్యవసానాల కారణంగా దీదీ .. ఒంటరిగానే పోటీకి సన్నద్దం అవుతున్నారు. ఆ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. తొలి రోజు కార్యక్రమాలు ఇలా..