TMC Leader Mukul Roy: సహజంగా రాజకీయాలలో పెద్ద స్థాయి నాయకులు వ్యక్తిగత భద్రత కావాలని కోరుకుంటారు. కేంద్ర ప్రభుత్వ నాయకులకు ఇవ్వడమే కష్టం. ఇస్తే దాన్ని ఒదులుకోరు. పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, యుపి తదితర రాష్ట్రాల్లో నాయకులకు ప్రత్యర్థుల నుండి త్రెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు వ్యక్తిగత భద్రత కోరుకుంటారు. నాయకులకు నలుగురు అయిదుగురు గన్ మెన్ ల భద్రత ఉంటే ఆ హోదా, దర్పం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వై, జడ్ కేటగిరి భద్రత అంటే ఆ నాయకుడు చాలా పాపులర్ కింద లెక్కే. ఇటువంటి తరుణంలో ఓ నాయకుడు తనకు కేంద్రం కల్పించిన జెడ్ కేటగిరి భద్రత వెనక్కుతీసుకోండి అని లేఖ రాయడం విశేషమే కదా. అలా ఎవరు లేఖ రాశారు. ఎందుకు రాశారు అనేది ఇప్పుడు చూద్దాం.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత ముకుల్ రాయ్ కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) కేటాయించిన జడ్ కేటగిరి భద్రత వెనక్కు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు. అయితే దీనిపై హోంశాఖ ఇంకా స్పందించలేదు. మార్చి నెలలో కేంద్రం ఆయన భద్రతను వై ప్లస్ నుండి జడ్ కేటగిరికి పెంచింది. టీఎంసీ పార్టీ ఆవిర్భావం నుండి మమత బెనర్జీతో ఉన్న ముకుల్ రాయ్ తన తనయుడుతో కలిసి 2017లో బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మూడవ సారీ ఘన విజయం సాధించడంతో ముకుల్ రాయ్ రెండు రోజుల క్రితం సొంత గూటికి వచ్చేశారు.
శుక్రవారం టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ సమక్షంలో పార్టీలో చేరారు. ఇదే సందర్భంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీలో చేరిన నేతలు పలువురు సొంత గూటికి చేరుకుంటారని పేర్కొన్నారు. టీఎంసీలో చేరిన మరుసటి రోజే ముకల్ రాయ్ కేంద్రానికి తన భద్రతను వెనక్కు తీసుకోవాలంటూ లేఖ రాయడం గమనార్హం.
అసలే టీఎంసీ, కేంద్రంలోని బీజేపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో టీఎంసీ నేతలకు కేంద్ర భద్రత ఉంటే పూర్తిగా వీరిపై కేంద్ర నిఘా ఉన్నట్టే భావించాల్సి ఉంటుంది. అధికార టీఎంసీలో చేరడంతో రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం భద్రత కల్పిస్తుంది. ఈ కారణాల వల్ల ముకుల్ రాయ్ కేంద్రానికి ఈ విధంగా లేఖ రాశారని భావిస్తున్నారు.