Toll Fees: జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఎఐ) టోల్ ప్లాజా రుసుములకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజ్ ల వద్ద నూతన రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం వాహనదారులు కొన్ని సందర్భాలల్లో అసలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే టోల్ ప్లాజాలు నగదు రహితంగా మారిన విషయం తెలిసిందే. వాహనదారులు నేరుగా రుసుము చెల్లించకుండా ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లిస్తున్నారు. ఏ టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలు జరగడం లేదు.
ఏ వాహనం టోల్ ప్లాజా దాటాలన్నా ఖచ్చితంగా ఫాస్ట్ ట్యాగ్ ఉండాల్సిందే. ఒక వేళ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే అక్కడే ఉన్న ఫాస్ట్ ట్యాగ్ తీసుకునే అవకాశం కల్పించారు. దేశ వ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్లో ఫాస్ట్ ట్యాగ్ లైన్లు ఉండటంతో ఇక వాహనాలు ఎక్కువ సేపు క్యూలో బారులు తీరి ఉండాల్సిన పరిస్థితి లేదు. ఏ వాహనం అయినా టోల్ ప్లాజా దగ్గర కు రాగానే ఫాస్ట్ ట్యాగ్ ద్వారా నగదు వసూళ్లు కొన్ని సెకండ్లలో జరిగిపోతుంది. దీని వల్ల వాహనాలు టోల్ ప్లాజాల వద్ద నిలపాల్సిన అవసరం లేదు.
ఎన్హెచ్ఎఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం టోల్ ప్లాజా వద్ద ఏ వాహనం అయినా పది సెకన్ల కన్నా ఎక్కువ సేపు నిలపాల్సిన పరిస్థితి రాదు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలోనూ పది సెకండ్లలోపే వాహనం టోల్ ప్లాజా దాటుతుంది. వంద మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉండకూడదని ఎన్హెచ్ఏఐ తెలిపింది. ఏ కారణం చేతైనా టోల్ ప్లాజా వద్ద వంద మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉన్నట్లైయితే వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లిపోవచ్చు. టోల్ ప్లాజా నుండి వంద మీటర్ల దూరంలో ఎల్లో లైన్ ఉంటుంది. ఆ ఎల్లో లైన్ దాటి వాహనాలు క్యూలో ఉంటే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా టోల్ ప్లాజాలో ఎమైనా సాంకేతిక సమస్యలు ఉన్నా వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లపోవచ్చని గతంలోనే కేంద్రం తెలిపింది.