Delta Plus: కరోనా కొత్త రూపాంతరాలు కలవరానికి గురి చేస్తున్నాయి. కోవిడ్ రెండవ దశలో కరోనా డెల్టారకం తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుతుండటంతో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్ డౌన్ ఆంక్షలను సడలింపులు ఇస్తున్న వేళ డెల్టా ప్లస్ రకం అని కొత్త వేరియంట్ వెలుగుచూడటం ఆందోళన కల్గిస్తోంది. ఈ వేరియంట్ విస్తరణ తీవ్రంగా ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలన్న వార్తలు భయపెడుతున్నాయి. మధ్యప్రదేశ్లో డెల్టా ప్లస్ వైరస్ కేసులు మొత్తం 12వరకూ వెలుగుచూడగా ఇద్దరు మృతి చెందారు. ఈ విషయంపై స్పందించిన ప్రభుత్వం వ్యాక్సిన్ వేసుకోనందు వల్లనే మరణాలు సంభవిస్తున్నాయనీ, టీకా వేయించున్న నలుగురు డెల్టా ప్లస్ వైరస్ నుండి రికవరీ అయ్యారని పేర్కొంటోంది. ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు.
Delta Plus: ఏపిలో తొలి డెల్టా ప్లస్ కేసు
కాగా ఏపిలోనూ తొలి డెల్టా ప్లస్ తొలి కేసు నిర్ధారణ అయ్యింది. తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు గుర్తించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆ బాధితుడి నుండి ఎవరికీ వైరస్ వ్యాపించలేదనీ, అతనికి చికిత్స కూడా పూర్తి అయ్యిందని మంత్రి తెలిపారు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ వేరియంట్ల కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితులపై సమీక్షలు జరుపుతూ అధికార యంత్రాంగానికి ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.