కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నూతన వ్యవసాయ (సాగు) చట్టాలను దేశంలోని అనేక ప్రాంతాల రైతులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గత రెండు నెలలుగా ఢిల్లీలో చలిని, వర్షాన్ని లెక్కచేయకుండా నిరసనలను కొనసాగిస్తున్నారు. చట్టాల్లో మార్పుల్లో మార్పులు చేస్తామని కేంద్రం చెబుతుండగా మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ తొమ్మిది సార్లు కేంద్రం రైతులతో కేంద్రం చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు.
కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, ఓం ప్రకాష్ నేడు రైతు సంఘాల నేతలతో పదవ విడత చర్చలను నిర్వహించారు. ఈ చర్చల్లో కేంద్రం ఒక మెట్టు దిగి కీలక ప్రతిపాదన చేసింది. కాలపరిమితి లేకుండా కమిటీ నివేదిక వచ్చే వరకూ మూడు వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తామనీ, రైతులు నిరసనలు విరమించి ఇళ్లకు వెల్లాలనీ సూచించింది. అయితే ఈ ప్రతిపాదనపై చర్చించుకుని తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని రైతు సంఘాలు తెలిపాయి.
నూతన సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని రైతు సంఘాల నేతలు పట్టుబడుతుండగా కేంద్రం అందుకు ససేమిరా అంటూ వచ్చింది. సాగు చట్టాల అమలు విషయంలో వెనక్కు తగ్గేది లేదని కేంద్రం తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యం కేంద్రం నేడు చేసిన కీలక ప్రతిపాదనలపై రైతు సంఘాల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 22వ తేదీన మరో సారి రైతు సంఘాలతో సమావేశమై చర్చించాలని నేటి సమావేశంలో నిర్ణయించారు.
ఇప్పటికే ఈ చట్టాల అమలుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారం కోసం నలుగురు నిపుణులతో కోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ నుండి భూపీందర్ సింగ్ మాన్ వైదొలగిన విషయం తెలిసిందే. మరో వైపు రైతు సంఘాల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీలో నాల్గవ సభ్యుడు నియామకంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కమిటీపై వస్తున్న విమర్శలపై ప్రధాన న్యాయమూర్తి బొబ్డే నేతత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాము కమిటీ సభ్యులకు ఎలాంటి నిర్ణయాధికారం ఇవ్వలేదనీ, అలాంటప్పుడు వారిని కించపరిచేలా మాట్లాడటం సరికాదని పేర్కొంది. కాగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ల ర్యాలీకి వ్యతిరేకంగా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం..ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది తేల్చాల్సింది పోలీసులకు సంబంధించిన విషయమని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ట్రాక్టర్ ర్యాలీ పై నిర్ణయాన్ని ఢిల్లీ పోలీసులకు వదిలివేసిన కేంద్రం తమ పిటిషన్ ను వెనక్కి తీసుకుంది.