Vaccine News: ఏదైనా కొత్త రకం వ్యాక్సిన్ వచ్చింది అంటే దాన్ని ముందుగా తీసుకోవాలంటే ఎవరైనా భయపడతారు. సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తాయేమో! అన్న భయంతో వేరే వాళ్లు తీసుకున్న తరువాత వారు బాగుంటే మనం తీసుకుందాం ! అని ఎక్కువ శాతం మంది ప్రజలు ఆలోచన చేస్తుంటారు. కానీ అటువంటి భయాలు ఏమీ లేకుండా ప్రపంచంలో తొలి కరోనా టీకా తీసుకున్న పురుషుడుగా బ్రిటన్ కు చెందిన ఓ వృద్ధుడు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వ్యక్తి కన్నుమూసినట్లు బ్రిటన్ మీడియా వెల్లడించింది. గత సంవత్సరం టీకా తీసుకున్నప్పటీ ఆరు నెలల పాటు సంపూర్త ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. కొన్ని రోజుల క్రితం వ్యాక్సిన్ కు సంబంధం లేని ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన టీకా తీసుకున్న ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు అని తెలిపింది.
Read More: Crime: మాస్క్ లేదని పోలీస్ లు మేకులు దించారు..! వాస్తవం కాదంటున్న అధికారులు..!!
గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన ప్రళయానికి ప్రపంచ వ్యాప్తంగా 35 లక్షల మంది మృతి చెందారు. కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులో రావడంతో ఎటువంటి భయం లేకుండా ఇద్దరు వృద్ధులు టీకా తీసుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిగా నిలిచిన బ్రిటన్ కు చెందిన విలియం షేక్స్పియర్ (81) నిలవగా, తొలి వ్యాక్సిన్ తీసుకున్న మహిళగా మార్గరేట్ కీనన్ (91) నిలిచారు. వీరు ఇద్దరు డిసెంబర్ 8న కోవెన్ట్రీ అండ్ వార్ విక్ షైర్ యూనివర్సిటీ హాస్పటల్ లో తొలి టీకా తీసుకున్నారు. ఫైజర్ బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన టీకాను వీరికి ఇచ్చారు.
అయితే టీకా తీసుకున్న తరువాత ఆరు నెలల పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న షేక్స్పియర్ ఇతర అనారోగ్య సమస్యల కారణంతోనే ఇటీవల ఆసుపత్రిలో చేరినట్లు కోవిన్ట్రీ కౌన్సిలర్ జైనే ఇన్నెస్ వెల్లడించారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించి ఈ నెల 20వ తేదీ మృతి చెందారు. టీకా తీసుకోవడంలో ప్రపంచానికి స్పూర్తిగా నిలిచిన ఆయనకు ప్రతి ఒక్కరు టీకా తీసుకోవడం ద్వారా ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని జైనే ఇన్నెస్ పేర్కొన్నారు.