Viral Video: ఎక్కడైనా నేరం జరిగితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల ఇంకా ప్రైవేటు పంచాయతీలు నిర్వహిస్తూ గ్రామ పెద్దలే నేరాలకు శిక్ష వేయడం, జరిమానాలు విధించడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే మరీ దారుణమైన శిక్షలను అమలు చేస్తున్నారు. చత్తీస్గడ్ లో అమానవీయ పద్ధతిలో గ్రామ పెద్దలు శిక్ష అమలు చేసిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విషయంలోకి వెళితే ..బల్ రామ్పుర్ – రామానుజ్ గంజ్ జిల్లాలోని చెరా గ్రామ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. చెరువులో చేపలను దొంగతనం చేశారని ఆరోపిస్తూ పాండో గిరిజన తెగకు చెందిన 8మందిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన జూన్ 15న జరిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు స్పందించారు. చేపల దొంగతనం చేశారన్న అభియోగంపై 8 మందిని గ్రామ పంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. సర్పంచ్ తో సహా గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీలోనే తీర్పు ఇచ్చారు. దండనతో పాటు ఒక్కొక్కరికి రూ.35 వేల జరిమానాను విధించారు. ఈ అఘాయిత్యాన్ని గ్రామస్తులు చూస్తున్నా ఎవరూ నోరు మెదపలేదు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సర్పంచ్ సహా గ్రామ పెద్దలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ ప్రశాంత్ కట్లామ్ తెలిపారు. పది మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
ఫోటోలు..ఎఎన్ఐ సౌజన్యంతో..