West Bengal : పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర అసెంబ్లీ దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పక్షాలైన బీజెపీ, టిఎంసీ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. వివిధ రంగాల ప్రముఖులను ఆకట్టుకుని పార్టీలో చేర్చుకుని కండువా కప్పేస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా సీఎం మమతా బెనర్జీ సమక్షంలో క్రికెటర్ మనోజ్ తివారీ, సినీ నటులు రాజ్ చక్రవర్తి, కంచన్ ముల్లిక్, సయోనీ ఘోష్ లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చేరి పార్టీ కండువాలు కప్పుకున్నారు.
మరో పక్క నేడు బెంగాల్ ప్రముఖ సినీనటి పాయెల్ సర్కార్ గురువారం బీజెపీ తీర్థం పుచ్చుకున్నారు. కోల్కతా నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో పాయెల్ సర్కార్ బీజెపీలో చేరగా ఆయన పార్టీ కండువా కప్పారు. అంతకు ముందు బీజెపీ ఇన్ చార్జి కైలాష్ విజయ వర్గీయ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా సమక్షంలో సినీనటుడు యాష్ దాస్ గుప్తా బీజెపిలో చేరారు.
కాగా సీఎం మమతా బెనర్జీ నిన్న హుగ్లీ జిల్లా సహగంజ్ లో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ, షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత వారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహగంజ్ లో జరిగిన సభలో టీఎంసీ కమీషన్లు (కట్ మనీ) తీసుకుంటోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సభలో మోడీని అతిపెద్ద అల్లర్ల సృష్టికర్తగా అభివర్ణించారు మమతా బెనర్జీ. అమిత్ షా, మోదీ ఇద్దరూ అసత్యాలు ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలకు దేశాన్ని అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. బీజెపి నేతల అవినీతిని క్యాట్ మనీ అంటారా లేక ర్యాట్ మనీ అంటారా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసి విజయం సాధించి మరో మారు అదికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన మమతా బెనర్జీ ఎన్నికల తరువాత ట్రంప్ కంటే దారుణంగా మోడీ పరిస్థితి తయారవుతుందని అన్నారు.