West Bengal : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తోడు వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. నెల రోజుల వ్యవధిలో సిలెండర్ కు వంద రూపాయల వరకూ ధర పెరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరు వంద రూపాయల మార్క్ దాటేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా సెస్ ను విధించడం వల్ల ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్పై కోల్కతాలో ఆమె చక్కర్లు కొట్టి నిరసన తెలిపారు. తొలుత మమతా బెనర్జీ..పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోన్న వ్యాట్ ఒక్క రూపాయి తగ్గిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అనంతరం నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. తన నివాసం నుండి సచివాలయం వరకూ ఎలక్ట్రిక్ బైక్ పై ప్రయాణించారు. పార్టీ సీనియర్ నేత ఒకరు ఈ బైక్ నడుపుతుండగా ఆమె వెనుక కూర్చున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసనగా ఓ బోర్డును మెడలో వేలాడ దీసుకున్నారు. ఈ వీడియోను మమత బెనర్జీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు పేదవాడికి అందుబాటులో ఉండే కిరోసిన్ ధరలను కూడా ప్రభుత్వం పెంచిందని మమత ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, సెయిల్, విశాఖ స్టీల్, కోల్ ఇండియా, ఓఎన్జీసి, ఎల్ఐసీ వంటి వాటిని నడిపించడం మోడీ సర్కార్ కు చేతకావడం లేదని దుయ్యబట్టారు.
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee travels on an electric scooter in Kolkata as a mark of protest against rising fuel prices. pic.twitter.com/q1bBM9Dtua
— ANI (@ANI) February 25, 2021