West Bengal: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్ కతాలోని రాజ్ భవన్ లో బుధవారం గవర్నర్ జగదీష్ ధన్ కర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా ఉదృతి నేపథ్యంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం సాదాసీదాగా నిర్వహించారు. దీదీ మాతృభాష బెంగాలీలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ముందు టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్ధా చటర్జీ మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సభ్యులు రేపు ( మే 6న) అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 292 స్థానాలకు గానూ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 213 స్థానాలు కైవశం చేసుకుని మూడవ సారి అధికారంలోకి వచ్చింది. 77 స్థానాలు బీజేపీ గెలుచుకున్నది.
పశ్చిమ బెంగాల్ 17వ అసెంబ్లీ నాయకురాలిగా మమతా బెనర్జీ ఎన్నుకున్నట్లు టీఎంసీ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మమతా బెనర్జీని గవర్నర్ ధనకర్ ఆహ్వానించారు. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి గానూ ఎమ్మెల్యేలు ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ విమన్ బెనర్జీని కొత్త అసెంబ్లీ యాక్టింగ్ స్పీకర్ గా ఎన్నుకున్నారు. కాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.