West Bengal: పశ్చిమ బెంగాల్ లో వరుసగా మూడవ సారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ముచ్చటగా మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకార తేదీ ఖారారు అయ్యింది. ఈ నెల 5వ తేదీ దీదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ నుండి పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ గెలుపొందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఆమెను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గవర్నర్ ను కలిసి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై చర్చించారు. సీఎంగా మమతా బెనర్జీ ఈ నెల 5వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. అయితే కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత సాధారణంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడమే తమ ప్రధమ కర్తవ్యమని టీఎంసీ పేర్కొంది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకూ ఎలాంటి ఉత్సవాలు జరపమని టీఎంసీ తెలిపింది.
పశ్చిమ బెంగాలలో బీజేపీతో జరిగిన హోరా హోరీ పోరులో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 213 స్థానాలు కైవశం చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజెపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో సహా ఆ పార్టీ హెమా హెమీలు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ దీదీ తన హవా నిలబెట్టుకుంది. బీజేపీ అధికారమే లక్ష్యంగా పోరాటం సాగించగా 77 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లో ఇంతకు ముందు బీజేపీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే ఉండగా ఇప్పుడు అనూహ్యంగా 77 స్థానాలు కైవసం చేసుకోవడం విశేషంగానే చెప్పుకుంటున్నారు.