పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉపాధ్యాయ నియామక స్కామ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ప్రస్తుత రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్ధా చటర్జీని అరెస్టు చేశారు. మంత్రి చటర్జీ సహా ఆయన సన్నిహితుడి నివాసంలో నిన్న సోదాలు నిర్వహించింది. మంత్రి చటర్జీ అనుచరులు అర్పితా ముఖర్జీ నివాసంలో రూ.20 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ముఖర్జీ నివాసంలో దొరికిన రూ.20 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవేనని భావిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. పార్ధా చటర్జీ ఇంతకు ముందు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
శుక్రవారం ఈడీ జరిపిన సోదాలో 20కిపైగా సెల్ ఫోన్లు, నేరాన్ని నిరూపించడంలో ఉపయోగపడే పత్రాలతో పాటు డొల్ల కంపెనీల వివరాలు, విదేశీ కరెన్సీ, బంగారం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కుంభకోణంతో సంబంధం ఉన్న వ్యక్తుల వద్ద లభించాయని ఈడీ వెల్లడించింది. పార్ధా చటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. సోదాలు జరిపి రూ.20కోట్లకు పైగా నగదు , కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న మరుటి రోజే ఈడీ ఆయనను అరెస్టు చేసింది. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో మంత్రి నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు… మంత్రి పార్ధా చటర్జీని అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు.