Yadiyurappa: పొరుగు రాష్ట్రాల రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కర్ణాటక సీఎం బీఎస్ యడియురప్ప ఉదంతం ఉత్కంఠను రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసేయడం, కొత్త సీఎం ఎంపికపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించడం తెలిసిన సంగతే. యడ్డి వారసుడి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్రెడ్డికి అప్పగించారు. అయితే, ఓ వైపు పరిణామాలు ఇలా మారుతుంటే యడియూరప్ప మాత్రం తనదైన శైలిలో పదవి దిగుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Read More : BJP: దూసుకువస్తున్న మాయావతి.. యూపీలో బీజేపీకి బీపీ?
యడియూరప్ప సంచలన నిర్ణయం…
యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసినప్పటికీ కొత్త సీఎంను ఎన్నుకునేంత వరకు కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ కోరారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చివరి నిమిషంలో యడియూరప్ప తీపికబురు చెప్పారు. ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో రాష్ట్రంలోని 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 4.5 లక్షల మంది పెన్షనర్లతో పాటు వివిధ పీఎస్యూలు, కార్పొరేషన్లలో పనిచేసే దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూలవేతనంలో 11.25 శాతంగా ఉంది. తాజా నిర్ణయంతో ఉద్యోగుల మూలవేతనంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది.
Read More: Modi: ఓ రికార్డు… ఓ నిరసన.. రెండూ మోడీ పెట్రోల్ ధరల మహిమేనట!
హాట్ హాట్ రాజకీయాలు…
ఇదిలాఉండగా, ఇవాళ రాత్రి 7 గంటలకు కొత్త సీఎంను ఎంపిక చేసేందుకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్రెడ్డిని నియమించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్టానం తరఫున వీరు సేకరించనున్నారు. సీఎం ఎంపిక ప్రక్రియ ఇంచార్జీలుగా ఇద్దరు కేంద్రమంత్రులను నియమించడంతో ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరారు. ఇదిలాఉండగా, కర్ణాటక సీఎం రేసులో ప్రహ్లాద్ జోషి, ముర్గేష్ నిరానీ, బస్వరాజ్ బొమ్మై ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈసారి ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉందన్న ప్రచారం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.