తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఏపీపై ఏమేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగుతున్నది. తెలంగాణలో కూటమి ఘోర పరాజయం ఏపీలో వైకాపా, జనసేన శ్రేణుల్లోనే కాకుండా బీజేపీ శ్రేణుల్లో కూడా జోష్ నింపింది. అలాగే ఏపీలో కాంగ్రెస్ నాయకులు కూడా హమ్మయ్య అనుకుంటున్నారు. తెలంగాణలో కూటమి సత్ఫలితాలు చూపి ఉంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పంచన చేరి వారిచ్చే సీట్లకు ఒప్పుకుని ఉండే పరిస్థితి వచ్చేదని, ఇప్పుడా భయం పోయిందని ఏపీ కాంగ్రెస్ నేతలూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించిన అనంతరం నిన్న సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆంధ్రా రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఏపీ రాజకీయాలలో తన సత్తా చూపిస్తానంటూ కేసీఆర్ అనడంపై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. కేసీఆర్ ఇటీవలి కాలంలో పదే పదే చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ కు తొలి అడుగు ఆంధ్రలోనే పడుతుందా అన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తం అవుతున్నది. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఆయన ముందుగా వైకాపా, జనసేనలను భాగస్వాములను చేయడంతోనే ఆరంభించే అవకాశాలు ఉన్నాయి.
ఏపీలో తెలుగుదేశం విధానాలు, చంద్రబాబు వ్యవహారశైలిపై నిత్యం విమర్శలతో విరుచుకుపడే ఈ రెండు పార్టీల అధినేతలూ కూడా తెరాస పట్ల సానుకూలంగానే ఉంటున్నారు. తెలంగాణ ఎన్నికలలో వైకాపా, జనసేన పార్టీలు బరిలోకి దిగలేదు. కానీ పరోక్షంగా తెలంగాణలో ఆయా పార్టీల నాయకులు, శ్రేణులు తెరాసకు మద్దతు పలికారన్నది వాస్తవం. ముఖ్యంగా సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ఈ పార్టీల ప్రభావం, మద్దతు తెరసకు బాగా ఉపయోగపడిందని ఫలితాల సరళిని బట్టి అర్ధమౌతున్నది.
ఈ నేపథ్యంలో ఏపీలో వేరువేరుగా అధికార పార్టీపైనా, తెలుగుదేశం ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పిస్తూ వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో అధికారం చేపట్టాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్న ఈ రెండు పార్టీలనూ ఫెడరల్ ఫ్రంట్ గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. అదే జరిగితే ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పవన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు. ఆ ఉద్దేశంతోనూ చంద్రబాబుకు సత్తా చూపుతానని కేసీఆర్ అన్నట్టుగా భావించవచ్చు. అభిప్రాయపడుతున్నాయి.