తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కల్వకుంట్ల తారకరామారావు అధ్యక్షతన తొలిసారిగా నేడు పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరు కావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర నాయకత్వానికి భవిష్యత్ కార్యాచారణ, విధివిధానాలపై దిశా నిర్దేశం చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే కేసీఆర్ అనూహ్యంగా కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయన వారసుడిగా కాబోయే ముఖ్యమంత్రిగా కేసీఆర్ దాదాపు ఖరారైనట్టేనని భావిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నాటికే కేసీఆర్ తన తనయుడు కేసీఆర్ కు పార్టీ పగ్గాలతో పాటు, అధికార పగ్గాలను కూడా అప్పగించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కీలక పాత్రపోషించేందుకు దీంతో మార్గం సుగమం చేసుకున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కేసీఆర్ సమర్థనాయకుడిగా పార్టీలో, ప్రజలలో తనను తాను రుజువు చేసుకున్నారనీ, అందుకే ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించినా ఎటువంటి ఇబ్బందీ ఉండదనీ తెరాస శ్రేణులు చెబుతున్నాయి. తెరాస సీనియర్లు కూడా కేటీఆర్ కు పూర్తి మద్దతు ప్రకటించారు.
ఇక పార్టీలో అత్యంత కీలకమైన హరీష్ రావు కూడా కేటీఆర్ కు ప్రమోషన్ పట్ల హర్షం వ్యక్తం చేయడం, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనను కేసీఆర్ ప్రకటించిన వెంటనే కేటీఆర్ స్వయంగా హరీష్ నివాసానికి వెళ్లడం తో కేటీఆర్ కు ప్రమోషన్ హరీష్ కు చెక్ పెట్టడమే అన్న ఊహాగానాలకు తెరపడినట్లయ్యిందని తెరాస సీనియర్లు అంటున్నారు. ఇక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఈనెల 17న బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియామకం తరువాత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పార్టీ బాధ్యతలన్నీ కేటీఆర్ వే అని ప్రకటించడంతో ఆయనకు కేబినెట్ లో స్థానం ఉంటుందా, ఉండదా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై పార్టీ సీనియర్లు స్పష్టత ఇచ్చారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కచ్చితంగా కేబినెట్ లో ఉంటారని, కీలకమంత్రిత్వ శాఖ ఆయనకు అప్పగిస్తారని చెప్పారు.