ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. నిన్న సాయంత్రం భువనేశ్వర్ లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయిన కేసీఆర్…రాత్రి భువనేశ్వర్ లోనే బస చేశారు.
ఈ ఉదయం ఆయన కోణార్క్ లోని సూర్యదేవాలయం, పురి జగన్నాధ దేవాలయాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం భువనేశ్వర్ చేరుకుని అక్కడ నుంచి కోల్ కతా వెళతారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతారు. ఫెడరల్ ఫ్రంట్ యత్నాలలో భాగంగా కేసీఆర్ మమతా బెనర్జీతో భేటీ కావడం ఇది రెండో సారి అవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలను ఓడించిన మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కేసీఆర్ మమతా బెనర్జీతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.