తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కల్వకుంట్ల తారకరామారావును నియమితులయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కేటీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ కుమారుడికి పార్టీ బాధ్యతలు అప్పగించారు.పార్టీ వ్యవహారాలను కేటీఆర్ కు అప్పగించిన కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టనున్నారు.
ఎన్నికల తరువాత పార్టీ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారన్న వార్తలు వినవచ్చిన సంగతి తెలిసిందే. తనయుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసమే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని విపక్షాలు కూడా అప్పట్లో విమర్శలు గుప్పించాయి. అయితే అప్పట్లో స్వయంగా కేటీఆర్ వాటిని ఖండించారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే కేసీఆర్ తనయుడిని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడడిగా నియమించడంతో ఇక ఆయన తన పూర్తి దృష్టిని జాతీయ రాజకీయాలపై సారిస్తారని భావించవచ్చు. కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేసే దిశగా కేసీఆర్ తొలి అడుగు వేశారని భావించవచ్చు.