ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ను కేంద్రం లోక్ సభలో రేపు బిల్లు రూపంలో ప్రవేశపెట్టనుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ సభ్యులకు విఫ్ జారీ చేసినట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ను లోక్ సభలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. బీజేపీ సభ్యులంతా సభకు హాజరు కావాలంటూ విఫ్ కూడా జారి చేసినట్లు పేర్కొన్నారు.
కాగా ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడు సార్లు తలాక్ అని ప్రకటించి విడాకులు ఇవ్వడం నేరంగా పరిగణించాలంటూ ఈ బిల్లు ప్రతిపాదిస్తున్నది. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొంది. త్రిపుల్ తలాక్ బిల్లుకు సుముఖత వ్యక్తం చేస్తూనే పలు పార్టీలు అది ఇప్పుడు ఉన్నట్లుగా కాకుండా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. ఈ విషయంపైనే గతంలో రాజ్యసభలో వాడివేడి చర్చ కూడా జరిగింది.