వన్య ప్రాణి సంరక్షణ విషయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా…చిన్న చిన్న నిర్లక్ష్యాలు వాటి ఉసురు తీస్తూనే ఉన్నాయి. అటవీ ప్రాంతాలలో రైలుపట్టాలు దాటుతూ వన్యప్రాణులు మృత్యువాత పడుతున్న సంఘటనలు తరచూ వింటూనే ఉంటాం. గజరాజులు తరచుగా ఇటువంటి ప్రమాదాల బారిన పడి మరణిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి.
అయితే తాజాగా మూడు సింహాలు గూడ్స్ రైలు ఢీ కొనడంతో మరణించిన సంఘటన గుజరాత్ లోని గిర్ అటవీ ప్రాంతంలో జరిగింది. గిర్ అటవీ ప్రాంతంలో అమ్రేలీ జిల్లాలో రైలు పట్టాల వెంట సింహాలు నడుచుకుంటూ వెళుతున్నాయి అదే సమయంలో గూడ్స్ రైలు మూడు సిహాలను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ మూడు సంహాలూ అక్కడికక్కడే మరణించాయి. ఈ సంఘటనలో మరో మూడు సింహాలు సురక్షితంగా తప్పించుకున్నాయి. మరణించిన సింహాలలో రెండు మగసింహాలు, ఒక ఆడ సింహం ఉన్నాయని అటవీ అధికారులు చెప్పారు.