హోరాహోరీగా జరిగిందన్న అంచనాలు తల్లకిందులైపోయాయి. ఇక్కడ వార్ వన్ సైడ్ గా మారిపోయిందని ఫలితాల సరళి తేటతెల్లం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు నువ్వా నేనాగా ప్రజాకూటమి- టీఆర్ఎస్ మధ్య జరిగిందన్న అంచనాలు ఫలితాల సరళి తేటతెల్లం చేస్తున్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తున్నది. కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ కూటమిని తెలంగాణ ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని ఫలితాల సరళి వెల్లడిస్తున్నది. ఒక దశలో హంగ్ ఏర్పడుతుందా అన్న అంచనాలు కూడా వచ్చాయి. అందుకే అవసరమైతే మద్దతుకు సిద్ధం అని బీజేపీ స్వచ్ఛందంగా టీఆర్ఎస్ కు ఆఫర్ చేయడం…మద్దతు లేకుండానే అధికారం చేపడతాం అంటూ విశ్వాసం వ్యక్తం చేసిన టీఆర్ఎస్, మజ్లిస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించేసింది.
ఇదే చాలు ఫలితాల పట్ల ఎంతటి ఉత్కంఠ నెలకొందో అర్ధమౌతుంది. ఉదయం ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచీ టీఆర్ఎస్ జోరు కొనసాగింది. పూర్తిగా ప్రభుత్వ సానుకూలత రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. రాజకీయ పరిశీలకులు దీనిని ఒక సైలెంట్ వేవ్ గా అభివర్ణిస్తున్నారు. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా మంది వెనుకంజలో ఉన్నారు. ప్రజాకూటమి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. తొలి నుంచీ విజయం పట్ల టీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న విశ్వాసం నిజమైంది.
అదే సమయంలో కాంగ్రెస్ లో ఓటమికి కారణాలేమిటన్న దానిపై విశ్లేషణల్లో మునిగిపోయింది. తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తును తెలంగాణ ప్రజ ఆదరించలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇండియా టుడే వెలువరించిన ఎగ్జిట్ పోల్ విశ్లేషణలో కూడా ఇదే చెప్పింది. తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.