శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపు హైదరాబాద్ చేరుకోనున్నారు. రేపటి నుంచి 24వ తేదీ వరకూ ఆయన హైదరాబాద్ లో బస చేస్తారు. ఆయన విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సిద్ధం చేశారు. ఆయన బస కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమీక్షించారు.
ఆయన ప్రయాణించే మార్గాలలో రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించి తగిన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి నగరానికి చేరుకున్నప్పటి నుంచి ఆయన తిరిగి వెళ్లే వరకూ నాలుగు రోజులూ ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.