అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన గ్రామ పంచాయతీల్లో ఉద్యోగుల భర్తీ ప్రకటనను పలు ప్రైవేటు వెబ్సైట్లు క్యాష్ చేసుకుంటున్నాయి.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే వైఎస్ జగన్మోహనరెడ్డి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తామనీ, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల నియామకానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వాలంటీర్కు ఐదు వేల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ లోపుగా వీటిని భర్తీ చేస్తామని జగన్ వెల్లడించారు.
అయితే ఇంత వరకూ ప్రభుత్వ పరంగా వీటికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడం గానీ నోటిపికేషన్ విడుదల చేయడం గానీ ప్రభుత్వం చేయలేదు. అయితే నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు నాలుగు లక్షల విలేజ్ వాలంటీర్ పోస్టుల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతుందనీ, ఆన్లైన్లో ధరఖాస్తులు చేసుకోవాలని ప్రకటిస్తున్నారు.
ఈ సైట్లలో నాలుగు లక్షల వాలంటీర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారంటూ జిల్లాల వారిగా ఎన్ని కేటాయింపులో కూడా పేర్కొంటున్నారు. ఆ సైట్లో జిల్లాల వారీగా కేటాయింపులను లెక్కిస్తే 17,286 మాత్రమే వాలంటీర్ పోస్టులు వస్తాయి. నిరుద్యోగ యువతకు అనుమానం కలిగేలా ప్రకటన ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయకముందే జూన్ నెలలో నోటిపికేషన్ విడుదల, ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరణ ప్రారంభం అని వెబ్సైట్లో పేర్కొన్నాయి. అర్హత పరీక్ష తేదీ, రిజల్స్ తేదీ వెల్లడించకుండానే సైట్లో 2019 ఆగస్టు 15లోపు నియామకాలు జరుగుతాయని పేర్కొంటున్నాయి.