మధ్యప్రదేశ్ లో ఓటమి బీజేపీలో ప్రకంపనలు రేపుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పార్టీ ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని ప్రకటించి 24 గంటల గడవక ముందే ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాకేశ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సమర్పించారు. అయితే ఆ రాజీనామాను అమిత్ షా తిరస్కరించి…ఎన్నికలలో పార్టీ అధిక స్థానాలు గెలుచుకుందని, పార్టీ పనితీరు బాగుందని పేర్కొన్నారు. ఓటమితో అసంతృప్తికి గురి కావాల్సిన అవసరం లేదని రాకేశ్ సింగ్ కు నచ్చచెప్పారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీ పరాజయానికి ఏ ఒక్కరిదీ బాధ్యత కాదని అన్నారు. మధ్యప్రదేశ్ లో పార్టీ చాలా బలంగా ఉందని, ఓటమి గురించి మరచిపోయి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ముందుకు సాగాలన్నారు.
previous post
next post