కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్ ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పు వెలువడిన మరుసటి రోజే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో సిక్కు వ్యతిరేక అల్లర్లలో తనను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువడిన నేపథ్యంలో తాను పార్టీ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అంతకు ముందు ఈ ఉదయమే ఆయన కన్నాట్ ప్లేస్ లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా విలేకరులు ఆయనను చుట్టుముట్టి కోర్టు తీర్పుపై ప్రశ్నల వర్షం కురింపించారు. అయితే ఆయన ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.