న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఇంటర్నెట్ వినియోగంలో భారత్ దూసుకుపోతోంది. జియో రాకతో డేటా వినియోగం లో ఇతర టెలికాం సంస్థలు కూడా దిగివచ్చి ఆఫర్స్ గుప్పించాయి. 2018లో భారత్లో ఇంటర్నెట్ కనెక్షన్లు 65శాతం పెరిగాయని ట్రాయ్ వెల్లడించింది. ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య 50 కోట్లు దాటింది. సెప్టెంబరు 2018 చివరి నాటికి భారత్లో న్యారో బ్యాండ్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు 56 కోట్లకు చేరాయని ట్రాయ్ పేర్కొన్నది. వీరిలో 54 కోట్ల మంది మొబైల్ ద్వారానే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని తెలియజేసింది. మిగతా వారు బ్రాడ్ బ్యాండ్ వాడుతున్నారని తెలిపింది. మొత్తం వినియోగదారుల్లో 36 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. 19.4 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు. ఆగస్టు 31, 2018 నాటికి 445.18 మిలియన్ల మంది మొబైల్ ఫోన్లు, డాంగిల్స్ ద్వారా అంతర్జాల సేవలు పొందుతున్నారని ట్రాయ్ తెలిపింది. ఇందులో ఐదు టెలికాం సంస్థలు ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. అత్యధికంగా జియో ఇన్ఫోకామ్ (252.25మిలియన్లు) ఉండగా ఆ తర్వాత ఎయిర్టెల్ (99.29మిలియన్లు), వొడాఫోన్ (51.82మిలియన్లు), ఐడియా సెల్యులార్ (47.90మిలియన్లు), బీఎస్ఎన్ఎల్ (20.12మిలియన్లు) ఉన్నాయి. ఇంటర్నెట్ వినియోగదారుల్లో అత్యధికంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్నారు.
previous post