పార్లమెంటు శీతాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ కూడా రోజు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. నేడుకూడా అదే పరిస్థితి. రాఫెల్, వ్యవసాయ సమస్యలు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబడుతూ సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.లోక్ సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించి ప్రశ్నత్తరాల కార్యక్రమం చేపట్టారు.
అయతే అధికార పక్ష సభ్యులు ఒక్కసారిగా వెల్ లోకి దూసుకొచ్చి రాఫెల్ పై తన వ్యాఖ్యలకు రాహుల్ గాందీ క్షమాపణలు చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ పదేపదే కోరినా సభ్యులు తమ ఆందోళన ఆపలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఇక రాజ్యసభలో కూడా విపక్షాల నిరసనల కారణంగా సభ వాయిదాపడింది. సభాధ్యక్ష స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు సంయమనం పాటించాల్సిందిగా కోరినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు.