మహారాష్ట్రలోని పూణె నుంచి తెలంగాణలోని హైదరాబాద్ మధ్య దూరం సుమారు 560 కిలోమీటర్లు. అంత దూరం వెళ్లాలంటే విమానంలో వెళ్లినా కూడా ఎయిర్ పోర్టుకు చేరుకోవడం, ఎయిర్ పోర్ట్ నుంచి చేరాల్సిన చోటుకు వెళ్లడం వరకు అంతా కలిపి ఓ రెండు మూడు గంటలైనా పడుతుంది.
కానీ.. ఇక్కడ మాత్రం కేవలం గంట అంటే గంటలోనే పూణె నుంచి హైదరాబాద్ కు ఊపిరితిత్తులను తరలించారు. ఓ ప్రాణాన్ని నిలబెట్టారు.
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి అత్యవసరంగా ఊపిరితిత్తులు కావాల్సి వచ్చింది. దాని కోసం ఆయన జీవన్ దాన్ ఫౌండేషన్ లో రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే పూణెకు చెందిన మరో వ్యక్తి బ్రెయిన్ డెడ్ అవడంతో ఆ వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.
దీంతో వెంటనే తెలంగాణ జీవన్ దాన్ ఫౌండేషన్ కు సమాచారం అందించడంతో.. వెంటనే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఊపిరితిత్తులను ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి వెంటనే కిమ్స్ ఆసుపత్రికి ఊపిరితిత్తులను భద్రపరిచిన పెట్టెను తరలించారు.
వెంటనే డాక్టర్లు ఆ ఊపిరితిత్తులను ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి అమర్చారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణం నిలబడింది. ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు కేవలం గంటలో పూణె నుంచి హైదరాబాద్ కు ఊపిరితిత్తులను తరలించడం నిజంగా గ్రేట్.
దీని కోసం పూణె, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రెండు ఎయిర్ పోర్టుల అధికారులు ఎంతో సహకరించారని.. డాక్టర్లు, ఆ వ్యక్తి బంధువులు తెలిపారు.