పేదరిక నిర్మూలన కోసం సంపద సృష్టించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వివిధ రంగాలలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిపై వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న నారా చంద్రబాబునాయుడు ఈ రోజు వరుసగా మూడో రోజున సంక్షేమ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారు.
పది రోజులపాటు ఒక్కొక్క అంశంపై శ్వేత పత్రాల విడుదల చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశామని పేదరికంపై గెలుపు అన్న కార్యక్రమాన్ని తీసుకుని ఆర్థిక అసమానతలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పింఛన్లు పెంచే విషయంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటుతో ప్రారంభమైనా, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆదాయం పెంచే చర్యలు చేపట్టామని చెప్పారు. పేదరిక రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.