వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చినా ప్రధానిని మార్చాలన్న డిమాండ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి గట్టిగా వినిపిస్తున్నది. ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని కాకుండా నితిన్ గడ్కరినీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నది. ఆర్ఎస్ఎస్ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషోర్ తివారీ ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖ రాశారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో బీజేపీ అధికారం కోల్పోవడానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వంటి నేతల అహంభావపూరిత వైఖరే కారణమని ఆయనా లేఖలో పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం తన వైఖరితో మిత్రులను దూరం చేసుకుంటున్నదని కిషోర్ తివారీ అభిప్రాయపడ్డారు. మోడీ, షాల ఆధ్వర్యంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా నియంతృత్వ ధోరణి పెచ్చరిల్లిందని, ఇది పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ ఎంత మాత్రం మంచిది కాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.