కేసీఆర్ కు బీజేపీ, బీఎల్ఎఫ్ లు నెత్తిన పాలుపోశాయని చెప్పాలి. కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐలతో కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందని భావించారు. అయితే వారి ఆశలకు బీజేపీ, బీఎల్ఎఫ్ గండి కొట్టాయి. చిన్న చిన్న పార్టీలను కలుపుకుని సీపీఎం బీఎల్ ఎఫ్ గా ఏర్పడి 109 స్థానాలలో పోటీకి దిగింది. అలాగే బీజేపీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూడా అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను రంగంలోనికి దింపింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కూటమికి పడతాయన్న కాంగ్రెస్, తెలుగుదేశం ఆశలు నెరవేరలేదు. బీజేపీ, బీఎల్ఎఫ్ ల పోటీ వల్ల పలు చోట్ల త్రిముఖ పోటీ, కొన్ని చోట్ల చతుర్ముఖ పోటీ అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ, బీఎల్ఎఫ్ పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గణనీయంగానే చీల్చాయని చెప్పాలి. ఇది కచ్చితంగా టీఆర్ఎస్ కు ప్రయోజనకరంగా మారింది. అదే సమయంలో టీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలిపాయన్న ప్రచారాన్ని జనం నమ్మలేదని కూడా ఈ ఫలితం తెలియజేస్తుంది. వీటికి తోడు టీఆర్ఎస్ సంక్షేమ ఫథకాలు కూడా టీఆర్ఎస్ విజయానికి దోహదపడ్డాయి.