ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హఠాత్తుగా సీరియస్ అయ్యారు. ఈ రోజు తన అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీకి హాజరు కాని నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి గైర్హాజరైన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ…ఇదే పరిస్థితి కొనసాగితే తాన స్పందన తీవ్రంగా ఉంటుందని, తాను ఏమైనా కఠిన నిర్ణయం తీసుకుంటే మీరు బాధపడతారనీ, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనీ హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పట్ల ప్రజలలో సంతృప్తి ఉన్నప్పటికీ కొందరు ఎమ్మెల్యేలూ, నేతల పట్ల ప్రజలలో వ్యతిరేకత కనబడుతోందంటూ ఇటీవల విస్తృతంగా వచ్చిన వార్తలు, స్వయంగా ముఖ్యమంత్రికి చేరిన రహస్య నివేదికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే నేతలను ఉపేక్షించేది లేదని గట్టి హెచ్చరిక చేశారు.
పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొందరు నేతల వ్యవహారశైలి వల్లే పార్టీ పరువు పోతున్నదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలతో మమేకమై పని చేయాలని, అలా చేయని వారిని ఎంతమాత్రం ఉపేక్షించనని చెప్పారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు టికెట్ దక్కే అవకాశాలు లేవనీ ఆయన స్పష్టం చేశారు.