ప్రధాని నరేంద్రమోడీ సామాజిక మాధ్యమంలో చాలా చురుకుగా ఉంటారు. ప్రభుత్వ విజయాల ప్రచారానికే కాకుండా, అభినందనలు, సందేశాలతో మోడీ నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు. ఎన్నికలలో ప్రచారానికి కూడా సామాజిక మాధ్యమాన్ని మోడీ వినియోగించుకున్నంత సమర్ధంగా మరే రాజకీయ నాయకుడూ వినియోగించుకోలేదంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు బీజేపీ కూడా కార్యకర్తలందరినీ సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉండేలా సమాయత్తం చేయడానికి ఉపక్రమించింది. అందులో భాగంగా తొలి అడుగు వేస్తున్నది. కార్యకర్తల కోసం ఒక వాట్సప్ గ్రూపును రూపొందిస్తున్నది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి నేతలతో నేరుగా సంభాషించేందుకు వీలుగా ఈ వాట్సప్ గ్రూపు రూపొందుతోంది.
దీని వల్ల పార్టీ వ్యూహాలు, విధానాల గురించి కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అప్ డేట్ తెలియజేయవచ్చనీ, అదే విధంగా కార్యకర్తలు కూడా తమ ఉద్దేశాలు, భావాలు, ఆలోచనలను నాయకులతో పంచుకునే అవకాశం ఉంటుందని ఈ వాట్సప్ పూరకర్తలు చెబుతున్నారు.