పశ్చిమ బెంగాల్ లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు కోల్ కతా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రథయాత్రల సందర్భంగా శాంతి భద్రతల పరిస్థితికి ఎటువంటి విఘాతం కలుగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని పాలనాయంత్రాంగాన్ని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ తలపెట్టిన రథయాత్రలకు పశ్చిమ బెంగాల్ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మూడు యాత్రలను నిర్వహించ తలపెట్టగా..ఆ మూడు యాత్రలకూ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. యాత్రలకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ కోర్టును ఆశ్రయించింది. బీజేపీ పిటిషన్ పై విచారించిన కోల్ కతా హైకోర్టు…చట్ట వ్యతిరేకం కానంతవరకూ యాత్రలను అనుమతి నిరాకరించడం కూడదని పేర్కొంది. అలాగే ఆంక్షలు కూడా న్యాయబద్దంగా ఉండాలని పేర్కొంది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెబుతున్న కారణాలు ఉహాజనితంగా కాకుండా వాస్తవంగా ఉండాలని పేర్కొంది.